ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల వల్లే నాణ్యమైన విద్య అందుతున్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి పేర్కొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో ‘సీఐఐ-ఎడుసమ్మిట్’ 5వ సెషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకొంటున్న నిర్ణయాల వల్ల అన్ని రంగాలు ప్రగతిపథంలో సాగుతూ, ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సాంకేతిక, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఈ ఏడాది ఎంసెట్ కన్వీనర్ కోటాలో 62,100 సీట్లు భర్తీ కాగా, అందులో 44,800 సీట్లు కంప్యూటర్ సైన్స్లో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న పదేండ్లలో సివిల్, మెకానికల్ ఇంజినీర్ల సమస్య తీవ్రం కానున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానంలో పరిశోధనలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ, శోభాదీక్షిత్ పాల్గొన్నారు.