హైదరాబాద్ : మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్నది. సాంకేతికతను వినియోగించుకొని తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడుతున్నది. బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసువచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందుతుంది. నగరంలోని మహిళలకు ఈ విధానంపై సోమవారం పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతితో కలిసి ఆవిష్కరించారు. మెట్రో రైల్లోని మహిళా ప్రయాణికులు, సిబ్బందితో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి, ఫిర్యాదు విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
అనంతరం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. మహిళలు, యువతులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ను తీసుకువచ్చినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేస్తే దాంతో ఫిర్యాదుల ఫేజ్ ఓపెన్ అవుతుంది.. ఇందులో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే షీ టీమ్స్ సెంట్రల్ సర్వర్కు చేరుతుందని ఆమె వివరించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, సమస్యల పరిష్కారానికి పట్టిన సమయం, అధికారుల ప్రవర్తన తదితర అంశాలను సైతం ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ఫిర్యాదు విధానంపై అవగాహన కల్పించేందుకు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, కళాశాలలు, కార్యాలయాల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు అడిషనల్ డీజీ తెలిపారు.