హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ): ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ బస్సు 40 మందికిపైగా ప్రయాణికులతో ఆదోనికి వెళ్తున్నది.
బస్సుడ్రైవర్ కోడుమూరు-ప్యాలకుర్తి మధ్య ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోగా, బస్సు బోల్తాపడింది. బస్సులో ఉన్న హైదరాబాద్కు చెందిన చిన్నారులు లక్ష్మి(13), గోవర్ధని(8) మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, కోడుమూరు, కర్నూలు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.