హైదరాబాద్: పాతబస్తి లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండువగా కొనసాగుతున్నది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటాని అన్నారు. అయతే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మవారికి బోనాలు సమర్మించేదుకు భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి లైన్లలో వేచిఉన్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, మరికొద్ది సేపట్లో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి శ్రీనివాస్యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.