హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నం పెట్టడంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. వానకాలం రికార్డు స్థాయి ధాన్యం కొనుగోళ్లే దీనికి నిదర్శనం. ఈ సీజన్లో ప్రభుత్వం సుమారు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికం. ఈ సీజన్లో 12.75 లక్షల మంది రైతుల నుంచి రూ.13,631 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 90 శాతం రైతులకు ధాన్యం డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కోసం 6,818 కేంద్రాలు ఏర్పాటుచేయగా మంగళవారం వరకు 6,650 కేంద్రాలను మూసివేశారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా ముగిసినట్టేనని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇవి మరో నాలుగు రోజుల్లో పూర్తి కావొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. ఈ జిల్లా నుంచి 6.86 లక్షల టన్నులు, 4.83 లక్షల టన్నులతో కామారెడ్డి, 4.43 లక్షల టన్నులతో నల్లగొండ, 3.99 లక్షల టన్నులతో సిద్దిపేట, 3.91 లక్షల టన్నుల తో కరీంనగర్ తర్వాతి స్థానా ల్లో నిలిచాయి.
కొనుగోళ్లలో నయా రికార్డు
గత వానకాలంలో 48.85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సీజన్లో ఏకంగా 70 లక్షల టన్నులకు పెరిగింది. గతేడాదితో పోల్చితే ఏకంగా 21.50 లక్షల టన్నులు అధికం. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో 2014-15లో వానకాలం సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం కేవలం 11.03 లక్షల టన్నులే.
కేంద్రం ఇబ్బంది పెట్టినా..
వానకాలం కొనుగోళ్లకు కేంద్రం అనేక సమస్యలను, ఇబ్బందులను సృష్టించింది. సీఎం కేసీఆర్ కల్పించుకొని కేంద్రంతో మాట్లాడి ఒప్పించారు. మొదట 60 లక్షల టన్నులకు అంగీకరించగా ఆ తర్వాత మరో 9 లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఇటు వర్షాలతో ఇబ్బందులు వచ్చినా, అటు ప్రతిపక్షాలు అడ్డంకులు కలిగించినా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ధాన్యం మొత్తాన్ని కొనుగోలుచేసింది.