హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటివరకు 30.09 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 6,544 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.72 లక్షల మంది రైతుల నుంచి రూ.5,888 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్టు అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రంలోకి వచ్చి, నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు.
రైతులకు ఎప్పటికప్పుడు వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచులు లేవని, నిధులు లేవని ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతమంతా అసత్యమేనని తేలిపోయింది. ఎక్కడా గన్నీ బ్యాగులు, నిధులు సమస్య లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగిపోతున్నాయి. కేంద్రం కపట బుద్ధితో రైతులను నట్టేట ముంచాలని చూసినా రాష్ట్రప్రభుత్వం సొంతంగా నిధులు సమకూర్చుకొని ధాన్యం కొంటున్నది.
500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి
ఇప్పటికే 500 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం తదితర జిల్లాల్లో మరో వారంలో కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. మొత్తంగా జూన్ 10 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
ప్రతిపక్షాలకు చెంపపెట్టు
సీఎం కేసీఆర్కు మొదటి ప్రాధాన్యం రైతులే. అందుకే కేంద్రం ఇబ్బందులు పెట్టినా ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ప్రతిపక్షాలకు చెంపపెట్టులా ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.
–గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి