సంగారెడ్డి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణపై వివక్ష ప్రదర్శించడం, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జడ్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానం ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. బోరుబావుల వద్ద మీటర్లు పెడితేనే రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇస్తామని కొర్రీలు పెట్టి, రాష్ర్టానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించారు.
పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు తీసుకున్నదని గుర్తుచేశారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టకుండా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నారని స్పష్టంచేశారు. యాసంగిలో 30 లక్షల బోరుబావులకు కరెంటు ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. లోడు పెరిగినా రైతులు ఇబ్బంది పడకుండా అదనంగా విద్యుత్తు కొనుగోలు చేయాలని సీఎం చెప్పారని వెల్లడించారు. యూనిట్కు రూ.20 నుంచి రూ.30 చెల్లించి రూ.1500 కోట్లతో అదనంగా విద్యుత్తును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, రాష్ర్టానికి రావాల్సిన నిధుల పంపిణీలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మునిపల్లి జడ్పీటీసీ మీనాక్షి, నాగల్గిద్ద జడ్పీటీసీ రాజునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
200 కొత్త అంబులెన్సులు
సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాకేంద్రంలో బస్తీ దవాఖానను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు 200 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్ల్లో ఖాళీగా ఉన్న నర్సు పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయవద్దని నిబంధనలు తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. త్వరలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.