Paddy Procurement | హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ టాప్ లేపింది. మొత్తం 6.75 లక్షల టన్నులతో రికార్డులకెక్కింది. నిజామాబాద్, జగిత్యాల రెండుమూ డు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తికాగా రైతుల నుంచి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈసారి రికార్డు స్థాయిలో 11 లక్షల మంది రైతుల నుంచి 65.56 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.13,477 కోట్లు ఖర్చు చేసింది. నిరుటి యాసంగితో పోల్చితే ఈ సీజన్లో 15.88 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7038 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించింది. 4 రోజుల క్రితం ఒకేసారి రూ.3 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయగా సోమవారం మరో రూ.1,500 కోట్లు జమ చేయడంతో డబ్బు చెల్లిం పు ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసింది.
అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఈ సీజన్లో రికార్డు నమోదైంది. 2019-20లో పౌరసరఫరాల సంస్థ 64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏకంగా 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. నల్లగొండ తర్వాత 6.43 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్, 4.16 లక్షల టన్నులతో జగిత్యాల వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. యాదాద్రి (3.75 లక్షల టన్నులు), సూర్యాపేట, కామారెడ్డి (3.59 లక్షల టన్నులు) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఆదిలాబాద్లో అత్యంత తక్కువగా 652 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టు పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతుల నుంచి ప్రతీ గింజను కొనుగోలు చేశామని పేర్కొన్నారు.