తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తీసుకురావడం, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిన విధానం చాలా బాగున్నది. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల విధానంలో దేశానికి మాడల్గా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ చాలా గొప్పగా చేశారు.
-భగవంత్సింగ్ మాన్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
సిద్దిపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు ఆవిష్కరించిందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించటం అసాధారణ ఘనత అని కొనియాడారు. తెలంగాణ నీటిపారుదల విధానం దేశానికే రోల్ మాడల్గా నిలిచిందని అన్నారు.
తెలంగాణ మాడల్ను పంజాబ్లో కూడా అమలు చేస్తామని తెలిపారు. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లు తరలించి రైతులకు సాగునీటి కష్టాలు తీర్చడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధ్దరించి భూగర్భజలాలు పెంచటం చాలా బాగున్నదని కొనియాడారు. సీఎం కేసీఆర్ చాలా గొప్పగా చేశారని ప్రశంసించారు. భగవంత్ మాన్ గురువారం సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు.
ఉదయం 10.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకొన్న పంజాబ్ సీఎం బృందానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు స్వాగతం పలికారు. రిజర్వాయర్, పంప్హౌస్, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధ్దరణ, భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టిన చర్యలను నీటి పారుదల అధికారులు వివరించారు. అనంతరం గజ్వేల్, మర్కూక్, ఎర్రవల్లిలో మీడియాతో భగవంత్సింగ్ మాన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్లో భాగంగా రిజర్వాయర్ల పరిశీలనకు వచ్చానని చెప్పారు.
తెలంగాణ విధానం పంజాబ్లో అమలు..
తెలంగాణ నీటి పారుదల విధానంలో తమకు అవసరమైన వాటిని పంజాబ్లో అమలు చేయాలనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చినట్టు భగవంత్మాన్ తెలిపారు. సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల పైకి గోదావరి నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆభినందనీయమని పేర్కొన్నారు. ఇది అన్నిప్రాంతాల పాలకులకు ఆదర్శమని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో వ్యవసాయరంగంతోపాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్యారోగ్యం రంగాల్లో అద్భుత అభివృద్ధి జరిగిందని కొనియాడారు.
‘పంజాబ్లో నీటిపారుదల వ్యవస్థ దేశ విభజనకు ముందు ఏర్పాటు చేశారు. మా వద్ద చాలా పెద్ద డ్యాంలు ఉన్నా.. చిన్నచిన్న చెరువులు లేక సమస్యగా ఉన్నది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిన్నచిన్న కాలువలు నిర్మించారు. అవి నేటి అవసరాలకు సరిపోవడం లేదు. చాలావరకు కాలువలు పూడుకపోయి శిథిలావస్థకు చేరుకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా పండుతున్నాయి. పంజాబ్లో భూగర్భజలాలు తక్కువ. అందువల్ల నూతన ఒరవడితో నీటిపారుదల రంగ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం పంజాబ్లోని కొన్ని జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
80 శాతం భూగర్భనీటి లభ్యత డార్క్జోన్లో ఉన్నది. తెలంగాణ మాడల్ను అనుసరించి పంజాబ్లో కూడా చెక్డ్యాంలు విరివిగా నిర్మించి జల సంపదను పెంచుతాం. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు పంటమార్పిడి పద్ధతి అనుసరిస్తున్నాం. మా నీటిపారుదల వ్యవస్థను తెలంగాణ మాదిరిగా ఆధునీకరించి భూగర్భజలాలను పెంచేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను భగవంత్సింగ్ మాన్ ఆక్షేపించారు.
తెలంగాణలా సంస్కరణలు తీసుకొస్తాం
తెలంగాణ తరహాలో తమ రాష్ట్రంలో వ్యవసాయ విధానాలను అమలు చేసి రైతులకు అండగా నిలబడుతామని పంజాబ్ సీఎం తెలిపారు. తెలంగాణలో మాదిరిగా 250 ఎకరాలకు సరిపడేలా చెక్డ్యాంలు పంజాబ్లో లేవని తెలిపారు. తెలంగాణలో నీళ్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయని, తమ రాష్ట్రంలో కంపెనీలతో నీళ్లు కలుషితమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ తరహాలోనే నీళ్ల సేకరణ, నీటిపారుదల రంగ అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణలో బీడు భూములు కనిపించేవని, ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని అన్నారు.
ఎడాదిలో నాలుగు కూరగాయ పంటలు, ఒక వరి పంట పండించడంతో ఇక్కడి రైతుల ఆదాయం బాగా పెరిగిందని, ఈ విధానాన్ని తాము ఆదర్శంగా తీసుకొంటామని చెప్పారు. తెలంగాణ రైతులతో ముచ్చటిచ్చడం చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమం చాలా బాగున్నదని, దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో పంజాబ్లో కూడా అమలుచేసి ప్రజలందరికీ కండ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం అద్భుతమని కొనియాడారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ‘మిషన్ కాకతీయ’లో భాగంగా అభివృద్ధి చేసిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువు వద్ద రైతులతో భగవంత్సింగ్ మాన్ ముచ్చటించారు.
పంజాబ్ సీఎం పర్యటన సాగిందిలా..
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు భగవంత్సింగ్ మాన్ గురువారం ఉదయం 10.30 గంటలకు చేరుకొన్నారు. డ్రిస్టిబ్యూషన్ విధానాన్ని అడిగి తెలుసుకొన్నారు. కాసేపు అక్కడే గోదావరి నీటిని పరిశీలించి సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉన్న ఇక్కడికి నీటిని తీసుకురావడం అద్భుతం అని అభినందించారు. అక్కడి నుంచి మర్కూక్ పంప్హౌస్కు చేరుకొని మోటర్ల పనితీరు, నీటిని ఎత్తిపోసే విధానాన్ని పరిశీలించారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన ఎర్రవల్లి చెక్డ్యామ్ను పరిశీలించారు. అనంతరం గజ్వేల్ పాండవుల చెరువును సందర్శించి రైతులతో మాట్లాడారు.