Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరం.. భద్రమైన జీవితం.. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం.. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం.. అన్నింకంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే గానీ, నష్టం ఉండదు.. ఇది హైదరాబాద్ నగరంలో శాశ్వత నివాసాల వైపు మొగ్గు చూపుతున్న ఉత్తరాదీవాసుల మనోగతం.. వ్యాపారవేత్తలు, అధికారులంతా ఖాళీ స్థలాలు, విల్లాలు కొనేందుకు మొగ్గు చూపుతుంటే.. ఉద్యోగులు అపార్ట్మెంట్లలో 3 బీహెచ్కేకు ఆసక్తి కనబర్చుతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోళ్లను పరిశీలిస్తే అత్యధికంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ వాసులే ఉంటున్నారని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొన్నారు. నార్త్ ఇండియన్స్తో కలిసి స్థానిక బిల్డర్లు భారీ మొత్తంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చుతున్నారని, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బిల్డర్లు, డెవలపర్లు స్థానికంగా ఈ రంగంపై గట్టి పట్టు ఉండటంతో నార్త్ ఇండియన్ కంపెనీలు వారితో కలిసి ప్రాజెక్టులు చేపడుతున్నారని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా హైదరాబాద్లోనే..
కొవిడ్ కంటే ముందు బెంగళూరు, చెన్నై కేంద్రంగా పనిచేసే తెలంగాణ రాష్ర్టానికి చెందిన సాఫ్ట్వేర్, ఇతర రంగ ఉద్యోగులంతా ప్రస్తుతం మకాం హైదరాబాద్కు మార్చుతున్నట్టు రియల్ రంగ నిపుణుడు విజయసాయి మేకా చెప్పారు. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ విధానంతో ఇండ్లను కొనుగోలు చేసి, ఇక్కడే ఉండేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడిలో రెట్టింపు ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నట్టు తెలిపారు.
ఈస్ట్ జోన్లోనూ జోరుగా కొనుగోళ్లు
హైదరాబాద్ నగరం చుట్టూ భారీగా కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. అద్దెల రాబడి కూడా అధికంగా ఉంటుండటంతో స్థిరాస్తి రంగంపై మొగ్గు చూపడం అధికమైందని హైదరాబాద్ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. మెట్రో సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఉప్పల్, ఎల్బీనగర్ మార్గం వైపు కూడా కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్పారు. వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయని, ఎకడ ఉన్నా ఆఫీసుకు గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండటంతో శివారు ప్రాంతంలో కూడా కొనుగోళ్లు ఎకువయ్యాయని రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దాంతో నిర్మాణాలు అదే స్థాయిలో అందుబాటులో ఉంటున్నాయని, మరోవైపు నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు.
ఈ ఏరియాలో విపరీత డిమాండ్
నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగిందని, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు నరెడ్కో సభ్యుడు ఒకరు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కోకాపేట్, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉందన్నారు.