గజ్వేల్ : అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కలలు కంటారని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని నిజం చేసి చూపించారని మహారాష్ట్రలోని పుణేకు చెందిన బృందం ప్రశంసించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్, కోమటిబండలోని మిషన్ భగీరథ సంప్హౌస్ను ఆదివారం పుణేకు చెందిన న్యాయవాదులు రవిరాణా సింగ్, విలాస్ సర్దేశ్వర్, ఇంజినీర్ కిశోర్ సర్దేశ్వర్ సందర్శించారు. గజ్వేల్ పట్టణ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సమీకృత మార్కెట్ నిర్మాణం, గతంలోని పరిస్థితులు, మార్కెట్ నిర్మాణం తర్వాత పెరిగిన సౌకర్యాలను బృందానికి వివరించారు.
అనంతరం కోమటిబండ సంప్హౌస్ను సందర్శించిన బృందం సందర్శించగా, ఏఈఈ పవన్ ప్రాజెక్టు గురించి వివరించారు. కోమటిబండలోని రైతు వేదికను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల కోసం చాలా గొప్ప పనులు చేయాలని అనుకుంటారని, అందరూ చేయలేకపోతారన్నారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకుని పరిస్థితులను చక్కదిద్దాలనుకోవడమే కాదు వాటిని చేసి చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సమీకృత మార్కెట్ ప్రజల కోసం అందించిన సౌలభ్యాన్ని తెలియజేస్తే, మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రజల కష్టాలను తీర్చాలన్న సీఎం కేసీఆర్లోని తపనను ప్రతిబింబించిందన్నారు. ఇలాంటి నాయకుడే దేశానికి అవసరమన్నారు.