టీఆర్ఎస్ది నిజాం పాలన కాదు.. నిజమైన ప్రజా పరిపాలన
బండి సంజయ్ ఒక పెద్ద జోకర్.. కేంద్రమంత్రి కిషన్.. కన్ఫ్యూజన్రెడ్డి
పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శ
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్షాపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు అమిత్షా విలన్లా మారారని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు చెప్పిన అమిత్షాకు కాళేశ్వరం జలాలతో స్నానం చేయించి, మిషన్ భగీరథ నీళ్లు తాగిపిస్తామని చెప్పారు.
బీజేపీది హిపోక్రసీ, కాంగ్రెస్ది ఆటోక్రసీ, టీఆర్ఎస్ది డెమోక్రసీ అని వివరించారు. బీజేపీని భారతీయ జాలిమ్ పార్టీగా, భారతీయ జులుం పార్టీగా అభివర్ణించిన జీవన్రెడ్డి.. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా తుక్కుగూడ సభలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం అమిత్ షాకు చేత కాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంటు సాక్షిగా తేలినా టీఆర్ఎస్ పాలనపై కక్ష పెంచుకొని అమిత్ షా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేసీఆర్ అంటే అమిత్ షాకు భయం పట్టుకొన్నదని, అందుకే సభలో 18 సార్లు కేసీఆర్.. కేసీఆర్ అని జపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కిటికీలు తెరిస్తే, బీజేపీ దర్వాజాలు తెరిచిందని ఆరోపించారు. ‘జాలిమ్ కౌన్ రే ఉసా జులుం క్యారే’ అని తెలంగాణ సమాజం బీజేపీని బొందపెట్టడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్ జోకర్గా మారారని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కన్ఫ్యూజన్రెడ్డి అయ్యారని ఎద్దేవా చేశారు. మోడీ పాలన దేశ ప్రజలకు బేడీల పాలనగా మారిందని పేర్కొన్నారు.