డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో అత్యుత్సాహం
కమలం పార్టీ కుటిల బుద్ధి గ్రహించి హెచ్చరిక
టీఆర్ఎస్తోనే గూడు దొరికిందని లబ్ధిదారుల స్పష్టీకరణ
రఘునాథపాలెం, జూలై 6: ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి అబాసుపాలయ్యారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంపై బీజేపీ నాయకుల కుటిల బుద్ధిని గమనించి లబ్ధిదారులు తిరగబడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం ఈ సన్నివేశం చోటుచేసుకున్నది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఖమ్మంలోని టేకులపల్లిలో తెలంగాణ సర్కారు 1200 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. దాదాపు వెయ్యి ఇండ్లను ఏడాది క్రితమే లబ్ధిదారులకు అందజేసింది. రెండో విడతలో భాగంగా మరో 200 ఇండ్లను నెల రోజుల క్రితం లబ్ధిదారులకు అప్పగించింది. ఈ ప్రక్రియనంతా పారదర్శకంగా పూర్తి చేసింది. దీంతో అక్కడి ప్రజలు ఈ ఇండ్లకు ‘కేసీఆర్ టవర్స్’గా నామకరణం చేసుకొన్నారు.
ఈ క్రమంలో బీజేపీ నేతలు బుధవారం ఆ ఇండ్ల వద్దకు వచ్చి, అక్కడ నివసించే మహిళలను కలిశారు. ‘మీకు ఇళ్లు ఎలా వచ్చాయి? ఎంతకు కొనుగోలు చేశారు? ఎవరికి డబ్బులు కట్టారు? ఎంత కట్టారు?’ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా గూడు కల్పించిందని వారు చెప్పారు. దీంతో లబ్ధిదారులను రెట్టించి ప్రశ్నిస్తుండటంతో.. కమలం పార్టీ నాయకుల కుటిల బుద్ధిని గ్రహించిన డబుల్ బెడ్రూం ఇండ్లవాసులు వారిపై తిరగబడ్డారు. ‘మీ బుద్ధి మాకు అర్థమైంది. కేసీఆర్ టవర్స్ ప్రాంగణాన్ని వీడి వెంటనే వెళ్లిపోండి’ అంటూ హెచ్చరించారు. అయినా బీజేపీ నేతలు వాదించే ప్రయత్నం చేయగా కాలనీవాసులంతా వారిని చుట్టుముట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. తప్పుడు ఆలోచనతో కేసీఆర్ టవర్స్లోకి అడుగు పెట్టి తమ గూడును చెదరగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ధి చెబుతామంటూ మండిపడ్డారు. ఇదివరకు ఏ ప్రభుత్వమూ తమకు ఇల్లు కట్టి ఇవ్వలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే తమకు గూడు కల్పించిందని, దీంతో తాము సంతోషంగా జీవిస్తున్నామని స్పష్టంచేశారు. బీజేపీ నాయకుల కారును అడ్డగించి ‘బీజేపీ డౌన్ డౌన్.. బీజేపీ నేతల్లారా గో బ్యాక్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. చేసేదేమీ లేక బీజేపీ నేతలు పలాయనం చిత్తగించారు.