సీపీఐ నారాయణ
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): పరిధికి మించి రాజకీయ వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసైని రీకాల్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ పదవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోలేడని, అసెంబ్లీని రద్దు చేయడం సాధ్యం కాదని గవర్నర్ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు.
బీజేపీ కార్యకర్తలా గవర్నర్
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తన ముసుగు తీసేసి రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై గవర్నర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్భవన్ కేంద్రంగా మారుతున్నదని విమర్శించారు.
గవర్నరా? బీజేపీ కార్యకర్తా?
తమిళిసై రాజకీయ వ్యాఖ్యలపై విప్ బాల్క సుమన్ ఫైర్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బీజేపీ కార్యకర్త మాదిరిగా రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హితవు చెప్పారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమిళిసై బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాలు మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం గురించి పొలిటికల్ లీడర్ మాదిరిగా గవర్నర్ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తమిళిసై గవర్నరా? లేక బీజేపీ కార్యకర్తనా? అని నిలదీశారు.