న్యూస్ నెట్వర్క్ జూలై 21 (నమస్తే తెలంగాణ) : నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన మోదీ సర్కార్పై సామాన్యులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జీఎస్టీపై రెండోరోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాలప్యాకెట్లు, పాల క్యాన్లతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్లో తాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పాల ఉత్పత్తులు, పిండి, బియ్యం, పప్పులు, తృణధాన్యాలు తదితర ఆహార ధాన్యాలపై పన్నులను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన నిరసనలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలో రాజీవ్ చౌరస్తాలో పాల ప్యాకెట్లు, పాల వ్యాన్లతో గులాబీ శ్రేణులు నిరసన చేపట్టారు. పాల ప్యాకెట్లపై విషం కక్కుతూ జీఎస్టీ 5శాతం పెంచడం దారుణమని దేశాన్ని పాలించే ప్రధాని మోడీ పాలకుడా? లేక సామాన్యుల రక్తం తాగే రాక్షసుడా? అని టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆందోళన చేశారు. సాలు మోదీ.. సంపకు మోదీ, జీఎస్టీని వెంటనే రద్దు చేయాలనే ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. పలు మండల కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారు.