Free Bus For Women | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి తన పిల్లో పేరొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు.
మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 15వ అధికరణానికి వ్యతిరేకమని వివరించారు. ఉచిత ప్రయాణ వసతితో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణించే పరిస్థితులు ఏర్పడ్డాయని, దీని ఫలితంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్లో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ జరుపనున్నది.