హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి, మాడల్ స్కూళ్ల టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విషయమై వారు వినతి పత్రం అందజేశారు. దీనిపై వారంలో షెడ్యూల్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనను మంత్రి ఆదేశించినట్టు తెలిపారు.
ఆన్లైన్ ప్రక్రియ ద్వారా బదిలీలు, పదోన్నతులను పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించాలని సూచించినట్టు వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో పీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, పీఆర్టీయూ టీఎస్ నాయకులు అమర్నాథ్రెడ్డి, ఆనందరావు తదితరులు ఉన్నారు.