హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం పీఆర్టీయూ టీఎస్ నేతలు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని శక్తులు అడ్డంకులు సృష్టించినా, పేపర్ లీకేజీల పేరుతో గందరగోళపరిచినా మొక్కవోని ధైర్యంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను వెల్లడించడం విద్యాశాఖ పనితీరుకు నిదర్శనమని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు కొనియాడారు. చరిత్రలో మొదటిసారిగా 26 లక్షల మంది విద్యార్థులకు నోటుబుక్లు ఇవ్వడం, 20 వేల టీచర్లకు ట్యాబ్లు, 1,982 బడులకు నైట్వాచ్మెన్లను నియమించడం పట్ల వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ప్రభుత్వ బడులు బలోపేతమవుతాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.