Hyderabad | ఖైరతాబాద్ మే 29: ట్రాన్స్లొకేషన్.. ఇది అందరికీ తెలిసిన పదమే అయినా చాలా అరుదుగా మాత్రమే వినిపిస్తుంటుంది. మానవ అవసరాల కోసం వృక్షాలను నేలకూల్చాల్సి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా తొలగించి మరో చోటికి తరలించి ప్రాణం పోస్తారు. ఇదే పద్ధతిలో ఇండ్లను సైతం వేరే చోటికి తరలిస్తున్నారు. తాజాగా ఇదే టెక్నాలజీ సాయంతో నగరంలోని ఎర్రమంజిల్ కాలనీలోని 35 వృక్షాలను నిమ్స్లోని హరిత వనానికి తరలించిన అధికారులను మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట నిమ్స్ దవాఖాన విస్తరణలో భాగంగా ఎర్రమంజిల్ కాలనీలోని పురాతన భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఏపుగా పెరిగిన వృక్షాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిని ఉన్నపళంగా నరికేయడానికి అధికారుల మనసు అంగీకరించలేదు. దీంతో వాటిని ట్రాన్స్లొకేషన్ ద్వారా మరో చోటికి తరలించి ప్రాణం పోశారు.
నిమ్స్ అధీనంలోని ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న పురాతన క్వార్టర్స్, ఇతర నిర్మాణాల తొలగింపు కొన్ని రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. దాదాపు 35 ఏండ్లుగా అక్కడ పెరుగుతున్న వృక్షాలను కూడా తొలగించాల్సి వచ్చింది. వాటిని నరికేందుకు ఇష్టపడని జీహెచ్ఎంసీ అధికారులు హార్టికల్చర్ అధికారుల సాయం కోరారు. ట్రాన్స్లొకేషన్ ద్వారా ఆ వృక్షాలను జాగ్రత్తగా పెకలించి ఈ నెల 25 నుంచి 28 వరకు మూడు దశల్లో 35 చెట్లను నిమ్స్లోని హరిత వనానికి తరలించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా 11 జూన్ 2016న సీఎం కేసీఆర్ నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలయ్యాయి. ఇప్పుడు ట్రాన్స్లొకేషన్ ద్వారా తరలించిన 35 వృక్షాలు అక్కడికే చేరాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నామని నిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారి డాక్టర్ లక్ష్మీభాస్కర్ తెలిపారు. ట్రాన్స్లొకేషన్ ద్వారా వృక్షాలను తరలించి రక్షిస్తున్న నిమ్స్ అధికారులకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.