హైదరాబాద్ : శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు రూ.40 వేల ఎక్స్ గ్రేషియా, వంట సరుకులు తక్షణమే అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం అయిన విషయంత తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో వెంటనే వారికి పునరావాస చర్యలు చేపట్టి, నష్ట పరిహారం అందిస్తున్నట్లుమం మంత్రి ప్రకటించారు.
గిరిజన సంక్షేమ శాఖ నుంచి 40 కుటుంబాలకు 25 వేల రూపాయల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి నష్టపోయిన కుటుంబాలకు 15వేల రూపాయల నష్టపరిహారం, 25 కిలోల బియ్యం, 1800 రూపాయల విలువైన 12 వస్తువుల వంట సామగ్రి కిట్ అందిస్తున్నట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో వారు కుదటపడే వరకు ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్యదర్శులు, కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వారికి ధీమా కల్పించారు.