బంజారాహిల్స్.అక్టోబర్ 28: కాంగ్రెస్.. పార్టీకి విశ్వాసంగా ఉండేవారి చేతిలోనుంచి వేరేవాళ్ల చేతిలోకి వెళ్లిపోయిందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి దివంగత పీజేఆర్ వారసత్వాన్ని దెబ్బతీస్తూ తనకు టికెట్ను నిరాకరించడం షాక్కు గురిచేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పనితీరు సరిగా లేదని, పార్టీని నాశనం చేస్తున్నారని ఆగ్రహించారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన తనకు టికెట్ ఇస్తామని పార్టీ సీనియర్ నేతలు మాణిక్రావు ఠాక్రే, రోహిత్ చౌదరి లాంటి వాళ్లంతా చెప్పడంతో చాలారోజులుగా ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నానని పేర్కొన్నారు.
హైదరాబాద్ క్రికె ట్ అసోసియేషన్ వ్యవహారాల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కోవడంతోపా టు కేసుల్లో ఉన్న అజారుద్దీన్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటున్న కాంగ్రెస్ నాయక త్వం.. చాలా కుటుంబాలకు రెండు టికెట్లు ఎందుకు ఇచ్చిందని నిలదీశారు. కొంతమం ది హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చుకున్నారని, తన సోదరికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చినందుకు తనకు ఇవ్వలేదనడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్ రాకున్నా తాను జూబ్లీహిల్స్ బరిలో ఉంటానని, కార్యకర్తలు, నాయకులతో ఆదివారం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
పీజేఆర్ను నమ్ముకున్న అనేకమందికి కాంగ్రె స్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. తాజాగా ప్రకటించిన జాబితాలో 12 చోట్ల గెలిచే అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. సెక్యులర్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరఫున కేవలం మతం ఆధారంగా టికెట్ ఇవ్వడం సరికాదని హితవుపలికారు. అజారుద్దీన్కు టికెట్ ఇవ్వాలనుకుంటే రాజేంద్రనగర్ వంటి నియోజకవర్గాలు ఉన్నాయని, అసదుద్దీన్ ఒవైసీ కూడా చాలెంజ్ చేసిన సంగతి గుర్తుచేసుకోవాలని సూచించారు. ఇతర పార్టీలోకి వెళ్లాలని ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, కార్యకర్తలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.