రామన్నపేట, ఆగస్టు 11: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రకు యాదాద్రి భువనగిరి జిల్లాలో అడుగడుగునా నిరసన సెగ తగులుతున్నది. నిన్నటికి నిన్న తాళ్ల సింగారంలో గ్యాస్ ధరలపై బండిని ప్రజలు అడ్డుకోగా తాజాగా గురువారం రామన్నపేటలో నిత్యావసరాల ధరలపై పలు పార్టీల నాయకులు, ప్రజలు నిలదీశారు. సంజయ్ యాత్ర రామన్న పేటలోని సుభాష్ సెంటర్కు చేరుకోగానే పలు పార్టీల నాయకులు నల్ల కండువాలతో వచ్చి పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నినాదాలు చేస్తూ యాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దాంతో బీజేపీ, స్థానిక నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే సీఐ మోతీరాం ఆధ్వర్యంలో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. పెంచిన ధరలపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చి, క్షమాపణ చెప్పి పాదయాత్ర కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమర్థుడైన ప్రధాని ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి, జీడీపీ ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. నిత్యావసర సరుకులు, పాలపై పెంచిన జీఎస్టీని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.