నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 10: ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని.. మునుగోడులో ఓటమిని జీర్ణించుకోలేక దాడులు చేస్తున్నారని ఆదిలాబాద్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు జోగు రామన్న, దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇండ్లు, వ్యాపార సంస్థలపై ఈడీ, ఐటీ దాడులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన జరిగింది. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్వలేకే బీజేపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని మున్నూరుకాపు సంఘం నాయకులు మండిపడ్డారు. గురువారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు తీసి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం దారుణమని మున్నూరుకాపు సంఘం నాయకులు చల్ల హరిశంకర్, శ్రీకాంత్ అన్నారు. మంత్రి ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తాళాలు పగులగొట్టి దాడులు చేయటం ఏమిటని మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సుడా చైర్మన్ విజయ్కుమార్ ప్రశ్నించారు. నోటీసు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తారన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద మున్నూరుకాపు నాయకులు ఈడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రెండోరోజు కొనసాగిన సోదాలు
కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ సోదాలు రెండోరోజు గురువారం కూడా కొనసాగాయి. రెండురోజులుగా పలు గ్రానైట్ సంస్థలు, మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండానే తిరిగి వెళ్లారు. కాగా, నిరాధార ఆరోపణలతో తన ఇంట్లో సోదాలు జరిగాయని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, ఎలాంటి సమాచారం అడిగినా అందిస్తానని చెప్పారు. విచారణ కోసం హైదరాబాద్ రావాలని తనకు చెప్పినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.