మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/శామీర్పేట: ఎంతో అన్యాయం జరిగిపోతున్నదని.. ఏదో రాజకీయం చేద్దామని సీఎం దత్తత గ్రామాలకు తగుదునమ్మా అని వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి శృంగభంగమైంది. రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపడానికి వచ్చారా? అంటూ స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు గ్రామాలను దత్తత తీసుకొన్నట్టు ప్రకటించడమే తప్ప.. తమ హయాంలో ఒక్కసారి కూడా ఆయా గ్రామాలకు వెళ్లిన దాఖలా కనిపించదు. కానీ దత్తత తీసుకొన్న గ్రామాలకు స్వయంగా వెళ్లి.. అక్కడి ప్రజలతో ముచ్చటించి.. వారి సమస్యలను తెలుసుకొని.. వాటి పరిష్కారాలను అప్పటికప్పుడే సూచించి.. అభివృద్ధికి అక్కడే కార్యాచరణ రూపొందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్థానికులు కొనియాడుతున్నారు. రూ.69 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. రేవంత్ కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తూ దొంగ దీక్షలు చేస్తున్నాడని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తమ మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తున్న రేవంత్.. ఎంపీగా ఆయనేం అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరం గ్రామాలను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ తానే స్వయంగా అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నారని, రేవంత్ మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ చేపట్టిన దీక్షకు నిరసనగా మూడుచింతలపల్లి-పోతారం చౌరస్తాలో జరిగిన స్థానికుల నిరసనలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడుచింతలపల్లిలో రేవంత్ దీక్ష వల్ల దత్తత గ్రామాల ప్రజలు బాధలు పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. త్వరలో మంత్రి మల్లారెడ్డితోపాటు ఇంటింటికీ వెళ్లి వారిని కలుస్తామని చెప్పారు. సంస్కారహీనుడైన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్ష్మాపూర్ గ్రామం ధరణి పోర్టల్లో లేదని మాట్లాడిన రేవంత్.. నిజాలు తెలుసుకోవాలని చెప్పారు. లక్ష్మాపూర్ గ్రామ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీచేసిన విషయంకూడా తెలియని మందబుద్ధి రేవంత్ది అన్నారు. నక్ష ఏర్పాటు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రైతుబంధు, రైతు బీమాలు వస్తున్నాయని వెల్లడించారు.
మాఊరైతే మంచిగయ్యింది
మా ఊరైతే మంచిగయ్యింది. కేసీఆర్ సార్ దత్తత తీసుకున్నప్పటి నుంచి ఎన్నో పనులు చేసిండు. నీళ్లు ఇచ్చిండు రోడ్లేసిండు పింఛన్లు ఇస్తుండు.
–బర్రె యాదయ్య, మూడుచింతలపల్లి
దీక్షకాడికి ఎవ్వరు పోలేదు
ముఖ్యమంత్రి వచ్చిన కాడినుంచి ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. రైతులకు, కులవృత్తుల వారికి మేలు జరిగింది. రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, మంచినీటి సౌకర్యం కల్పించారు. ఊర్లో సమస్యలన్నీ తొలిగిపోయాయి. ఇంకేముంది దీక్షకు పోనీకి? అందుకే మా ఊర్లకెన్ని ఒక్కరం పోలేదు.
-ఇంద్రసేనారెడ్డి, కేశవరం
ఎంతో అభివృద్ధి జరిగింది
నాగిశెట్టిపల్లి ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం దత్తత గ్రామాల్లో అనుబంధ గ్రామం గా ఉన్నప్పటికీ అ భివృద్ధికి అనేక నిధులు ఇచ్చారు. వీటితో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి.
-కృపాకర్రెడ్డి, సర్పంచ్ నాగిశెట్టిపల్లి
దీక్ష పేరిట రాజకీయం
దీక్ష పేరిట రాజకీయాలను మా గ్రామస్తులు నమ్మరు. దీ క్షకు మూడుచింతలపల్లి గ్రామస్తులు వెళ్లలేదు. ఇతర ప్రాంతాల నుండి తప్ప స్థానికులు ప్రజలు ఎవ్వరూ రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిపై దత్తత గ్రామాల ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నది.
–యాదగిరి, మూడుచింతలపల్లి