జూలూరుపాడు, జూలై 03 : ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని జూలూరుపాడు మండలం కాకర్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.విజయ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పాఠశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్ మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ బత్తుల నరసింహారావు 30 ప్లాస్టిక్ కుర్చీలను వితరణ చేశారు. గ్రామస్తుడు మిర్యాల రమేష్ ప్రత్యేక చొరవ, సహకారంతో దాత అందజేసిన కుర్చీలను పాఠశాల హెచ్ఎంకు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. దాత నరసింహారావుకు, సహకరించిన రమేశ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రూప్లా, వాలంటీర్ కె.అనూష, అంగన్వాడీ టీచర్ నాగమణి పాల్గొన్నారు.