సూర్యాపేట, మార్చి 1 : సాగు నీటికోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా రైతాంగం కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. అందులో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట నియోజక వర్గంలోని ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాలకు చెందిన రైతులు శుక్రవారం సూర్యాపేట కల్టెరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్కు చెందిన రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాలకు ఎస్సారెస్పీ పరిధిలోని 69, 70, 71వ డీబీఎం కాల్వల్లోకి సరిపడా నీళ్లు రాకపోవడంతో ఆయకట్టులోని పంటలు ఎండిపోతున్నాయి.
కేసీఆర్ హయాంలో గత నాలుగేండ్లు కాళేశ్వరం జలాలతో ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందగా, ఇప్పుడు చాలీచాలనట్టుగా వస్తున్న నీళ్లు పంట భూములు తడవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే.. పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతుండటంతో రైతులు తట్టుకోలేక పోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరో 15 రోజులపాటు పూర్తి సామర్థ్యంతో నీరు అందిస్తే తప్ప పంటలు కాపాడుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్లో ఇప్పటికే సుమారు 300 ఎకరాల్లో వరి ఎండి పోయిందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. కలెక్టరేట్కు రావడానికి ముందు కోటపహాడ్ గ్రామ రహదారిపై రాస్తారోకో చేశారు. పెన్పహాడ్ మండలం, చివ్వెంల మండలంలోనూ సాగునీరు లేక భూగర్భ జలాలు సైతం అడుగంటి బోర్లు పోయడం లేదని రైతులు ఆవేదన చెందారు. రైతుబంధు రాకపోయినా అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఇప్పుడు నీళ్లు కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన పంట పూర్తిగా ఎండిపోతున్నదని, ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీటిని సరిపడా విడుదల చేయాలని నూతనకల్ మండల కేంద్రానికి చెందిన మల్లారెడ్డి పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న రైతులు, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు కలెక్టరేట్ ఏవో సుదర్శన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.