Congress | నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇందల్వాయి/మరికల్: ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు నిరసన సెగ మొదలైంది. ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, కరెంటు, నీళ్లు తదితర సమస్యలపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ‘గో బ్యాక్.. గో బ్యాక్’ అంటూ నినదిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకారులకు ఏదో ఒకటి సర్దిచెప్పి, బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడుతున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్రెడ్డికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న హామీని రేవంత్రెడ్డి సర్కార్ నిలుపుకోకపోతే తాను సైతం ధర్నా చేస్తానంటూ కాంగ్రెస్ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది.
జీవన్రెడ్డికి నిరసన సెగ
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రసంగిస్తుండగా మహిళలు, రైతులు అడ్డుకున్నారు. పింఛన్లు ఏవి? నీళ్లు ఏవి? కరెంట్ ఏది? రుణమాఫీ ఏమైంది? రూ.4 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? రూ.500కే గ్యాస్ సిలిండర్ ఎటుపోయింది? అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాకే గ్రామాల్లోకి రావాలని స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ నేతలు తెల్లముఖం వేశారు. మాట్లాడుతుంటే అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సర్దిచెప్పపోయినప్పటికీ గ్రామస్తులు శాంతించలేదు.
సీఎంవో ఎదుట ధర్నా చేస్తా: ఎమ్మెల్యే వాకిటి
మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం కన్మనూరులో సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆగ్రహావేశాలు చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నేతల సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్త మహదేవ్ మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకపోతే 20వ తేదీన ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్పందిస్తూ, సీఎం రేవంత్రెడ్డిపై తనకు నమ్మకం ఉన్నదని, ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి తానే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పాలుపంచుకొని పాదయాత్ర చేశానని, ఈ ప్రాంత రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉరుకోనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో నిరసనల సైగ తగలడంతో కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.