హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12న ప్రధాని మోదీ తలపెట్టిన రామగుండం పర్యటన సందర్భంగా నిరసనలు వ్యక్తంచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఏడాది క్రితమే ఉత్పత్తిని ఆరంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మోదీ ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎంబీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు, టీఆర్ఎస్ను గెలిపించేందుకు సైద్ధాంతిక పోరాటం చేశామని వివరించారు. ఫాసిస్టు ఆరెస్సెస్కు రాజకీయ విభాగమైన బీజేపీ దేశానికి ప్రమాదకరమని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వారిద్దరూ.. వారికిద్దరూ అన్న చందంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా.. అంబానీ, అదానీల వ్యవహారం నడుస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు సహజ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ధరలు మంట పెడుతున్నాయి
బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు.. ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు మోదీ హయాంలో డబుల్ అయ్యాయి. ఒకప్పుడు మా ఇంట్లో కిరాణా సామాను, కూరగాయలకు నెలకు రెండు మూడు వేలకు మించి కాకపోయేది. ఇప్పుడు ఖర్చు డబుల్ అయ్యింది. చివరికి గ్యాస్ ధర కూడా 400 నుంచి 1200కు పెరిగింది. పెరిగిన ధరలు వంటింట్లో మంటపెడుతున్నాయి.
– పచ్చిమడ్ల మానస, చేర్యాల, సిద్దిపేట జిల్లా
గిరిజనులంటే అలుసెందుకు?
మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి గిరిజనులంటే అలుసు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగం స్పష్టం చేసినా పట్టించుకోవటం లేదు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఇయ్యాల్టి వరకు అమలు చేయడం లేదు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం తాత్సారం చేస్తే ఉమ్మడి పోరాటాలు చేస్తాం.
-డాక్టర్ రమణనాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం