కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 12 : అంగన్వాడీ కేంద్రాల్లో(Anganwadis) సీసీ కెమెరాలు( CC cameras) ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా(Dharna) నిర్వహించారు. సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లను దొంగలుగా చిత్రీకరించటమేనని మండిపడ్డారు.
బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం అభినందించదగిన అంశమే అయినా టీచర్లకు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అప్పగించకూడదని సూచించారు. పౌష్టికాహారం దుర్వినియోగం పేర రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ చర్యలతో అంగన్వాడీ టీచర్లు అవమానభారంతో కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పరోక్షంగా అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నట్లేనని మండిపడ్డారు. సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. వేసవి నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని, మేలో సెలవులు ప్రకటించాలని కోరారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.