న్యూఢిల్లీ: ‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు’ అని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి నిరాకరిస్తూ బుధవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశాన్ని స్వయంగా స్వీకరించాలని కోరుతూ ఒక న్యాయవాది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ని ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ని స్వీకరించడానికి ధర్మాసనం నిరాకరించింది. మా సమయాన్ని వృథా చేయవద్దు. మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు అంటూ సీజేఐ ఆ న్యాయవాదికి కటువుగా సూచించారు. ఈ ఏడాది ఆరంభంలో సీజేఐ నిరుద్యోగ యువతను బొద్దింకలుగా సంబోధించడంతోనే సీజేపీ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.
సీజేపీ మార్చ్లో విద్యార్థులపై పోలీసులు దాడులు చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ పిటిషన్లు పబ్లిసిటీ కోసమే వేశారంటూ చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఇది పబ్లిసిటీ పిటిషన్ అని మీరెలా చెప్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులకు సంబంధించిన అన్ని రకాల సీసీ ఫుటేజీలను భద్రపరచాలని ఆదేశించింది.