MP Ranjith Reddy | వికారాబాద్, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ): గతంలో ఎంపీగా ఉండి ఏం చేశావంటూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని స్థానికులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంతో పాటు మైల్వార్, దామర్చేడ్ గ్రామాల్లో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వీరిద్దరికీ చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
బషీరాబాద్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని 25 రోజులు దీక్ష చేస్తే, ఎంపీగా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలపైనే తాము ప్రశ్నిస్తున్నామని, దీనిపై సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఎమ్మెల్యే మనోహర్రెడ్డిని కూడా మహిళలు నిలదీశారు. రుణమాఫీపై ఇప్పటివరకు నిర్ణయమెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చాకే ఓట్లడగాలని స్పష్టం చేశారు. ప్రచారం చేసిన నాలుగు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవడంతో, నేతలంతా చేసేదేమీ లేక పోలీస్ రక్షణలో వెనుదిరిగారు. వారం క్రితం తాండూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరువకముందే, తాజాగా ఈ నిలదీతల అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.