నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 15 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్లో బుధవారం నిర్వహించిన ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు స్పీకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మాల్యాద్రిరెడ్డి స్పీకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా అడ్డుకోలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మాల్యాద్రి రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య దాదాపు గంటపాటు తోపులాట జరిగింది. మండల కేంద్రంలో మరోసారి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు మాల్యాద్రిరెడ్డిని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుబట్టడంతో మాల్యాద్రిరెడ్డి గ్రామం నుంచి వెనుదిరిగారు.