మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన చేయూత వల్ల ఆర్య వైశ్యులకు మంచి గుర్తింపు, గౌరవం లభించింద్నారు. ఆర్య వైశ్యులకు నాలుగు కార్పొరేషన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ పదవులు ఇచ్చారు.
ఇంత ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఆర్యవైశ్యులు అండగా నిలబడాలన్నారు. ఆర్య వైశ్యులకు జిల్లాలో అన్ని విధాలా అండగా మేము కూడా ఉంటామని హామీనిచ్చారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆర్య వైశ్య భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఇచ్చారు. జిల్లాలో కూడా స్థలం ఇచ్చి, భవన నిర్మాణానికి కూడా తోడ్పాటు ఇస్తామన్నారు.
మంత్రితో పాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షుడు, టి.ఎస్. ఎం. ఐ. డి.సి చైర్మన్ అమరవాది లక్ష్మీ నారాయణ, తెలంగాణ చేతి వృత్తుల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్, ఇతర నేతలు హాజరయ్యారు.