హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో ప్రమోషన్లు కల్పిస్తూ ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను జారీచేసింది. 50 మంది ఎంపీడీవోలకు, జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) జిల్లా పరిషత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు కల్పించింది. 24 మంది డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (డిప్యూటీ సీఈవోలు) జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (సీఈవోలు) ఉద్యోగోన్నతి కల్పించింది.
ఈ మేరకు సోమవారం ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఈ రెండు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రమోషన్లు పూర్తిగా తాతాలిక ప్రాతిపదికన కల్పించినట్టు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అప్పీళ్లు, రిట్ పిటిషన్ల తుది తీర్పులకు లోబడి నియామకాలు చేపట్టినట్టు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. ఉద్యోగోన్నతి పొందిన 50 మంది డిప్యూటీ సీఈవోలు, 24 మంది సీఈవోలు తదుపరి పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుతం వారు పనిచేస్తున్న చోటే కొనసాగాలని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోపు ప్రమోషన్ పొందిన పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ప్రమోషన్ హకును కోల్పోతారని తెలిపారు.