మన్సూరాబాద్, డిసెంబర్ 24: ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఆకాంక్ష నెరవేరుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్ మన్సూరాబాద్లోని ఎంఈరెడ్డి గార్డెన్లో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని అన్నారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి రూ.25 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. విద్యాశాఖలో కొత్త ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. డిప్యూటీ డీఈవో పోస్టుల నియామకానికి ఆర్థికశాఖ నుంచి అనుమతి ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వివిధ రూపాల్లో ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ, రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులను సైతం నిలిపివేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని వివరించారు.
పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం: సబితారెడ్డి
టీచర్ల ప్రమోషన్లు, బదిలీల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ సూచించారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చెప్పారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు ఒకరికొకరు సహకరించుకొంటూ సమస్యలను పరిష్కరించుకుందామని అన్నా రు. మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ లాంటి సంఘం ఇస్తున్న సలహాలు, సూచనలు ప్రభుత్వం పాటిస్తున్నదని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో ఎస్టీయూటీఎస్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, సంఘం అధ్యక్షుడు జీ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.