యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హమీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలు, ఐఐటీ, ఐఐఎం, త్రిపుల్ ఐటీ, గిరిజన, మైనింగ్ యూనివర్సిటీలనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిది ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు.మోదీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేసిందన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఓట్ల కొరకు ఆయా రాష్ట్రాలు తిరుగుతూ మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర కమిటీసభ్యులు బట్టుపల్లి అనురాధ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.