‘శేషం కోపేన పూరయేత్..!’ అని సంస్కృతంలో ఓ నానుడి. ఒక సమస్యనో, చర్చనో తుదిదాక ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు.. మధ్యలోనే కోప్పడి, ఆ కోపంతోనే విషయాన్ని పూరించినట్టు అనుకుంటారట. ప్రాజెక్టుల అప్పగింతపై సీఎం రేవంత్ స్పందన అలాగే ఉన్నది. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడానికి పూనుకొని.. చివరకు పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగి.. కీలకమైన ప్రాజెక్టుల సబ్జెక్టుకు నీళ్లొదిలారు.
ముఖ్యమంత్రి అయినా.. సమాధానం చెప్పే స్థానంలో ఉన్నా.. పరనిందకే రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనుకున్న ప్రతిసారీ.. దూషణలకు దిగడం పరిపాటిగా మారింది. దావోస్లో తన ఆంగ్లభాష నవ్వులపాలవడంతో.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు లండన్లో గోతుల భాష మాట్లాడారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజాభవన్ ముందు తన ఆటోకు డ్రైవర్ నిప్పుపెట్టడంతో ఆ మంటల్ని మరిపించడానికి.. ఇంద్రవెల్లిలో ‘దంచుడు’ మాటలు మాట్లాడారు. ఇప్పుడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియా ప్రశ్నలకు చిర్రెత్తిన రేవంత్.. మళ్లీ నోటికి పనిచెప్పారు. ఎక్కడ సర్కారు దోషిగా నిలబడుతుందోనని.. బూతుల భాషను అందుకున్నారు.
ఎన్నికల వేళ సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే కేసీఆర్ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందన్నారు రేవంత్. కోడ్ అమల్లో ఉన్నప్పుడు, ఆపద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? 2014లో విభజన చట్టం రూపొందించిందే కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు అన్న విషయం వదిలేసిన రేవంత్.. ప్రభుత్వ వెఫల్యాన్ని రాష్ట్ర సాధకుడిపైకి నెట్టేందుకు ప్రయాసపడుతున్నారు. మరి, పదేండ్లు ప్రాజెక్టులు కేంద్రం చేతికి ఎందుకుపోలేదు? కాంగ్రెస్ పాలనలో 60 రోజుల్లోనే కృష్ణా ప్రాజెక్టులపై అధికారం ఎలా కేఆర్ఎంబీ పరమైంది? అన్నీ ప్రశ్నలే..! సర్కారు వైపు నుంచి స్పష్టమైన సమాధానం రాని ప్రశ్నలు. వాటికి జవాబివ్వలేక.. పరనింద! పలాయనం!
CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకవైపు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అది గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందంటూ పచ్చి అబద్ధాలకు తెరతీసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పత్రికాముఖంగా కొన్ని డాక్యుమెంట్స్ చూపి వాటి ఆధారంగా బీఆర్ఎస్ను నిందించే యత్నం చేశారు. గత ప్రభుత్వమే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొన్నదని, ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందని, ప్రాజెక్టుల నిర్వహణకు బోర్డులకు సీడ్మనీ ఇవ్వడానికి బడ్జెట్ నిధులను పొందుపరిచిందంటూ సీఎం రేవంత్ ఎదురుదాడికి దిగారు. డాక్యుమెంట్లలో ఒకటి అర వాక్యాలు చదివి మిగతా ప్రధానాంశాలను విస్మరించి రాష్ట్ర ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని కూడా బీఆర్ఎస్పైకి నెట్టేందుకు పూనుకొన్నారు. సీఎం రేవంత్రెడ్డి వెల్లడించిన అంశాలన్నీ పూర్తిగా అసత్యమని ఆయా డాక్యుమెంట్లను పరిశీలిస్తేనే స్పష్టమవుతున్నది.ఏపీ పునర్విభజనకు ముందు తెలంగాణ, ఏపీకి మధ్య ఎలాంటి నీటి ఒప్పందాలు లేవు. ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా ప్రత్యేకంగా వేర్వేరుగా లేవు. ఉమ్మడి ఏపీని పరిగణనలోకి తీసుకొని ఇచ్చినవి మాత్రమే. దీంతో అప్పటికే ప్రాజెక్టులవారీగా నీటి లెక్కలను తీయగా ఏపీ 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణ 299 టీఎంసీలను (34 శాతం) వినియోగించుకొంటున్నది. ఆ లెక్కలనే పునర్విభజన చట్టంలో అనాటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచింది.
ఆ ముసాయిదా బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో 2013లో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆ జలాలను ప్రాజెక్టులవారీగా మాత్రమే కేటాయించాలని ట్రిబ్యునల్ 2కు కేంద్రం అప్పటికే మార్గదర్శకాలు జారీ చేయగా, వాదనలు కొనసాగుతున్నాయి. అయితే, అప్పటివరకు కృష్ణాజలాల వినియోగం కోసం ఇరు రాష్ర్టాలతో కేఆర్ఎంబీ 2015లో సమావేశాన్ని నిర్వహించింది. అప్పటికే వినియోగించుకుంటున్న 66:34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను ఇరు రాష్ర్టాలు తీసుకోవాలని బోర్డు ప్రతిపాదించింది. అందుకు తెలంగాణ పలు షరతులను విధిస్తూ ఒప్పందం చేసుకొన్నది.
ఆ ఒప్పందం కేవలం 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమేనని తెలియజేసింది. ఈ ఒప్పందమనేది ఏ వేదికపైనా కూడా చెల్లబోవని స్పష్టంగా నొక్కిచెప్పింది. వీటిని సీఎం రేవంత్దాచిపెట్టి గత ప్రభుత్వమే 299 టీఎంసీలకు ఒప్పుకొన్నదని చెప్పడం గమనార్హం. ఈ ఒప్పందానికి ముందుగానే నాటి ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పున:పంపిణీ చేపట్టాలని, ట్రిబ్యునల్ వేయాలని కోరింది. అయినప్పటికీ రేవంత్రెడ్డి ఆ విషయాలను ప్రస్తావించకుండా కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకొన్నదని చెప్పి బీఆర్ఎస్పై బురదజల్లేందుకు యత్నించారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా పాత నిష్పత్తినే కొనసాగించడానికి బీఆర్ఎస్ ఒప్పుకొన్నదని ఆరోపించిన రేవంత్.. ఎలాంటి డాక్యుమెంట్ చూపకపోవడం కొసమెరుపు. వాస్తవంగా అలాంటి ఒప్పందమేమీ లేకపోవడం గమనార్హం.
2016 నాటికి కూడా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో 2015 ఒప్పందాన్ని మరొక ఏడాదికి పొడిగించడానికి మొదటి అపెక్స్ మీటింగ్ నిర్ణయం జరిగింది. 2017-18 నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయి ఆయకట్టుకు నీరిచ్చే దశకు చేరుకొన్నాయి. కృష్ణాలో మన నీటి వినియోగం పెరిగింది. అందుకే 2018 నుంచి నీటి పంపిణీ 50:50 నిష్పత్తిలో జరగాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత బోర్డు సమావేశాల్లో, లేఖల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నది. బోర్డు మాత్రం మన వాదనలను పెడచెవినపెట్టి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికి తలొగ్గి పాత నిష్పత్తినే కొనసాగిస్తూ నిర్ణయాలు తీసుకొన్నది.
ప్రాజెక్టుల అప్పగింత విషయంలో గెజిట్లో పేరొన్న అన్ని ప్రాజెక్టులు కాకుండా కేవలం కామన్ ప్రాజెక్టులను మాత్రమే అప్పగించడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే బీఆర్ఎస్ సర్కారు స్పష్టంగా షరతులు పెట్టింది. ఆ షరతులనే ఈ ప్రభుత్వం కూడా 27.1.2024న రాసిన లేఖలో కేంద్రానికి తెలియజేసింది. అనాడు బీఆర్ఎస్ సర్కారు పెట్టిన షరతులను ఇటీవల కాంగ్రెస్ సర్కారు మరోసారి కేంద్రానికి విధిస్తూ వాటిమీదనే ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకొన్నామని రేవంత్ ఆరోపించడం గమనార్హం. ఏడేండ్లుగా నీటిపంపిణీకి సంబంధించి తాత్కాలిక ఒప్పందాన్నే కొనసాగించడమేంటని బీఆర్ఎస్ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని కొత్త ప్రతిపాదనను ప్రతిపాదించింది. బోర్డు పాతవిధానంలోనే కేటాయింపులను స్వతహాగా చేపట్టగా దానిపైనా కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు.
2023 మే 10న నిర్వహించిన కేఆర్ఎంబీ 17వ బోర్డు సమావేశంలో నీటి పంపిణీకి సంబంధించిన తాత్కాలిక ఒప్పందానికి ఏమాత్రం ఒప్పుకొనేది లేదని కరాఖండిగా ఆనాటి సర్కారు తేల్చిచెప్పింది. 50:50 నిష్పత్తిని తప్ప దేన్నీ ఒప్పుకోబోమని నొక్కిచెప్పింది. బోర్డు ఏకపక్షంగా నిర్ణయం చేయజాలదని తేల్చిచెప్పింది. ఆ అంశంతోపాటు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని కూడా అపెక్స్ కౌన్సిల్కు నివేదించాలని డిమాండ్ చేసింది. అనాటి బోర్డు సమావేశ మినిట్స్లో ఈ అంశాలన్నీ రికార్డయ్యాయి. అప్పటికీ అవేవి చెప్పకుండా కేవలం ప్రాజెక్టుల అప్పగింతకు అనాటి ప్రభుత్వమే అంగీకరించిందని మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించడం గమనార్హం.
ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకొన్నదని చెబుతూ మరో రుజువుగా 2023-24 బడ్జెట్ డిమాండ్ పుస్తకాన్ని రేవంత్రెడ్డి చూపారు. అందులో 114 పేజీలో బోర్డులకు సీడ్మనీ చెల్లించడం కోసం బడ్జెట్లో 400 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం పొందుపరిచిన మాట వాస్తవమే. అక్కడ కూడా షరతులను విధించింది. తెలంగాణ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతేనని స్పష్టంగా తెలియజేసింది. ప్రాజెక్టుల అప్పగింతకు తాము విధించిన ముందస్తు షరతులు ఒప్పుకొంటే, అప్పుడు సీడ్మనీ చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి.. బడ్జెట్లో ఆ అంశం ఉండాలి కాబట్టి ఆ మేరకు ప్రతిపాదనలు పెట్టింది. నాటి సర్కారు పెట్టిన షరతులకు బోర్డు, కేంద్రజల్శక్తి నుంచి స్పందనరాలేదు కాబట్టి బోర్డులకు సీడ్మనీ కింద ఒక రూపాయి చెల్లించలేదు. అప్పగింత అంశంలో విధించిన షరతులపై నాటి ప్రభుత్వం రాజీ పడలేదు కాబట్టే అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. తదుపరి చర్చలు కొనసాగలేదు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే, ప్రగతిభవన్ వేదికగానే కొనసాగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. జగన్తో కుమ్మక్కయ్యారని కూడా చెప్పారు. వాస్తవమేంటి అంటే ఆర్ఎల్ఐఎస్ను అనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకించింది. అందుకు సాక్ష్యంగా కేంద్రానికి, బోర్డుకు రాసిన అనేక లేఖలున్నాయి. 2020 మేలో జగన్ సర్కారు జీవో 203 జారీ చేయడానికి ముందు ఆ ప్రాజెక్టుపై ఆ రాష్ట్రం సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్రా అసెంబ్లీలో డిసెంబర్ 2019లో చేసిన ప్రకటన నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది.
కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఫలితంగానే రాయలసీమ లిఫ్ట్ పనులను తక్షణమే ఆపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ నాటి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా ఆంధ్రా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అదే సమయంలో ఒక ప్రైవేట్ వ్యక్తి పర్యావరణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టారని ఎన్జీటీలో కేసు వేస్తే ఆ కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. బలమైన వాదనలను వినిపించి ఆ ప్రాజెక్టు పనులపై స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. ఎన్జీటీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిజనిర్ధారణ కమిటీని కూడా వేయించింది. రాయలసీమ లిఫ్ట్పై బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం రాజీలేకుండా పోరాటం చేసిందనడానికి అంతకంటే సాక్ష్యం ఏం కావాలి. అవేవీ చెప్పకుండా నిరాధారంగా, ఎలాంటి రుజువు చూపకుండానే జగన్మోహన్రెడ్డితో మాజీ సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని రేవంత్రెడ్డి ఆరోపించడం గమనార్హం.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణపై కేసీఆర్, హరీశ్రావు, అనాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎవరూ నోరు మెదపలేదని, కాంగ్రెస్సే కొట్లాడిందని సీఎం రేవంత్రెడ్డి పెద్ద అబద్ధం ఆడారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి నిర్ణయం తీసుకున్న వెంటనే అందుకు నిరసనగా కేసీఆర్, హరీశ్రావుతోపాటు ఇతరులు తమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. అది తెలంగాణ కండ్లముందున్న చరిత్ర. అయినప్పటికీ ఆ సంగతి మరుగునపెట్టి రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయానికి మద్దతు ఉందని అనడం చరిత్రను అపహాస్యం చేయడమే. అదీగాక ఆనాడు క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తే, కుమ్మక్కై మంత్రి పదవుల్లో కొనసాగిన ఈనాటి సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని పక్కన పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేయడం మరింత దారుణం. పోతిరెడ్డిపాడు విస్తరణను తలపెట్టిన కాంగ్రెస్నే అందుకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని చెప్పడం పచ్చి అబద్ధం.
ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్రానికి గత ప్రభుత్వం అనేక లేఖలు రాసింది. అనేక డిమాండ్లను పెట్టింది. అందుకు సంబంధించి నిర్వహించిన సమావేశాలను పలు సందర్భాల్లో బాయ్కాట్ చేసింది. సీడబ్ల్యూసీ రూపొందించిన ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్ ఏపీకి వంతపాడేలా ఉన్నదని చెప్పి నిర్దంద్వంగా తిరస్కరించింది. దీంతో ఆ ప్రక్రియ పూర్తిగా పక్కన పడింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు ప్రాజెక్టుల అప్పగింతకు షరతులను విధించామని, అప్పటివరకు అంగీకరించేది లేదని చెప్తూనే మరోవైపు ప్రాజెక్టుల అప్పగింత తర్వాత తీసుకోవాల్సిన నిర్వహణ చర్యలకు సిద్ధమవుతున్నది.
ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకుండానే ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరిస్తున్నది. కేంద్రం నుంచి కూడా అందుకు జవాబులేమీ రాలేదు. ఇక నాగార్జునసాగర్ డ్యామ్ను తిరిగి తెలంగాణ స్వాధీనం చేసుకుంటుందా? లేదా? అనేదిపైనా స్పష్టతనివ్వలేదు. కానీ పూర్తిగా గత ప్రభుత్వంపై నిందనలు మోపేందుకే పత్రికా సమావేశం పెట్టినట్టుగానే ఉన్నది తప్ప ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. ఒకవైపు ఒప్పుకోమంటారు? మరోవైపు గత ప్రభుత్వమే అది చేసిందంటూ అసంబద్ధ, అవాస్తవ వాదనలు వినిపించారు తప్ప మరేమీ లేదు.
‘రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు కాదు. ప్రజాజీవితంలో విలువలకు కట్టుబడాలి. నేతల ప్రవర్తనను ప్రజలు గమనిస్తారు’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ‘రాజకీయాల్లో దుర్భాషలు సరికాదు’ అని సినీ నటుడు చిరంజీవి ఆదివారం ఉదయం పద్మ అవార్డు గ్రహీతల సన్మానంలో సూచించారు. వారి మాటను గౌరవిస్తానని.. ఇక వ్యక్తిగత దూషణలకు వెళ్లబోనని సీఎం రేవంత్ వేదికపైనే మాట ఇచ్చారు. ఇది జరిగిన కొన్నిగంటలకే విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. -ఇదీ అయన చిత్తశుద్ధి.
‘రాష్ట్ర విభజన సమయంలో కృష్ణాజలాల పంపిణీపై 66:34 నిష్పత్తిలో చేసుకున్న అవగాహన ఒక సంవత్సరానికే పరిమితం కదా, దాన్ని కేసీఆర్ అంగీకరించిన పూర్తిస్థాయి ఒప్పందంగా ఎలా చెప్తారు?’ అని ‘నమస్తే తెలంగాణ’ విలేకరి ప్రశ్నించగానే జవాబు లేక సీఎం రేవంత్ నీళ్లు నమిలారు. ‘నీ పేరేంది? ఏ పేపరు నీది? మీరంతే కదా’ అని అడ్డదిడ్డంగా మాట్లాడి విలేకరుల సమావేశం ముగించి వెళ్లిపోయారు.
‘తెలంగాణ రాష్ట్రమిచ్చిందీ, వరాలన్నీ గుప్పించిందీ కాంగ్రెస్’ అన్ని ఇన్నాళ్లుగా చెప్తూవస్తున్న రేవంత్ ఇవ్వాళ కొత్త లాజిక్ సృష్టించారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన విభజన చట్టాన్ని కేసీఆరే రాశారని, అందువల్ల కృష్ణా జలాల పంపిణీలో జరిగే అన్యాయానికి ఆయనే బాధ్యత వహించాలని చెప్పుకొచ్చారు. మరి చట్టాన్ని కేసీఆర్ రాస్తే రాష్ర్టాన్నీ కేసీఆరే తెచ్చినట్టు కదా! ఒకవేళ చట్టంలో కేసీఆర్ అన్యాయం చేస్తే.. దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సరిచేయలేదు? ప్రాజెక్టులు అప్పగించాలని కేసీఆరే రాసుంటే.. మరి అధికారంలో ఉన్న పదేండ్లు ఆయన అప్పగించలేదు కదా! కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు అప్పగించినట్టు?
60 ఏండ్ల ఉమ్మడి వలస పాలనలో కన్నా పదేండ్ల కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సర్వనాశనమైందట!. వైఎస్, చంద్రబాబులతో కేసీఆర్ కుమ్మక్కయ్యారట. ఇవీ కాంగ్రెస్ ముఖ్యుల మాటలు. తెలంగాణలో సాగునీళ్లు, కరెంటు 60 ఏండ్లు ఎట్లుండె? ఈ పదేండ్లలో ఎట్లున్నయ్? 60 రోజుల రేవంత్ పరిపాలనలో ఎట్లున్నయ్? తెలంగాణ ప్రజలకు తెల్వదా? వైఎస్, చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యుంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడిది? ప్రత్యేక రాష్ట్రమెక్కడిది? రేవంత్కు సీఎం పదవెక్కడిది? ఇదీ రాజకీయ పరిశీలకుల ప్రశ్న.