యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామం దళిత వాడల్లో ప్రొఫెసర్ల బృందం పర్యటించింది. దళిత బంధు పథకంపై బృందం సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. దళిత వాడల్లో ఇంటింటికి తిరుగుతూ దళితులను కలిసి, దళిత బంధు పథకం తెచ్చిన గుణాత్మక మార్పును అధ్యయనం చేస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వాసాలమర్రి దళితులు దళిత బంధును ఎలా విజయవంతం చేస్తున్నారు ? ఏ వృత్తులను ఎంచుకున్నారు? ఆత్మవిశ్వాసం ఎలా పెరిగింది? స్వాలంభన దిశగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు?.ఎంచుకున్న వృత్తుల్లో ఏ మేరకు నైపుణ్యాలను మెరుగు పర్చుకున్నారు.
ఇలా అనేక అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. వారివెంట బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, కవి, రచయిత, జూలూరి గౌరీ శంకర్, ప్రముఖ చరిత్రకారుడు అడప సత్యనారాయణ, ఎస్ఆర్టీఐ డైరెక్టర్ కిషోర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జె.దేవి ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్, ఎంజీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఉన్నారు.