హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) తన వీల్ చెయిర్కు శాశ్వత సెలవు ప్రకటించారు. ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ అని ఏనాడో ప్రకటించిన ఆయనను చివరికి మృత్యు వు అణువణువూ ఆక్రమించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా (57) హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సాయిబాబాకు గత నెల 28న ఆపరేషన్ జరిగింది. గాల్ బ్లాడర్ను (పిత్తాశయాన్ని) తొలగించి స్టంట్ వేసిన చోట చీము పట్టడంతో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, హైఫీవర్తో బాధపడ్డారు. వైద్యులు చీమును తొలగించినప్పటికీ సాయిబాబా పరిస్థితి మరింత క్షీణించిందని, డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కోలుకోలేకపోయారని ఆయన భార్య తెలిపారు.
పేద రైతు కుటుంబంలో జన్మించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 1967లో పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబా పోలియో వ్యాధి బారిన పడటంతో ఐదేండ్ల వయసు నుంచే వీల్చైర్ను ఉపయోగిస్తున్నారు. వారి గృహానికి కనీసం విద్యుత్తు సౌకర్యం కూడా లేదు. అయినా 90% వైకల్యంతో బాధపడుతూనే ఎంతో కష్టపడి చదివారు. అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసిన ఆయన.. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లోనూ విద్యాభ్యాసం చేశారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా కెరీర్ ప్రారంభించి అక్కడే ఎన్నో ఎండ్లుగా పనిచేశారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు. అమలాపురంలో డిగ్రీ చదువుతున్నప్పుడే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులైన సాయిబాబా.. ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్లో చేరారు. 1992లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివేటప్పుడే ఏఐఆర్పీఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యదర్శిగా నియమితులైన సాయిబాబా.. 1995 నాటికి ఆ సంస్థలో జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఆర్డీఎఫ్ అనే సంస్థలో చేరినట్టు తెలుస్తున్నది. ఇవన్నీ మావోయిస్టు అనుబంధ సంస్థలేనని పోలీసులు చెప్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం 2013లో హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి అనే మావోయిస్టులను అరెస్టు చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా సహకారంతో మావోయిస్టు నేతలను కలిసేందుకు వెళ్తున్నట్టు పోలీసులకు వారు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో 2013 సెప్టెంబర్లో ఢిల్లీలోని సాయిబాబా ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014 మే నెలలో ఆయనను అరెస్టు చేశారు. వైద్య కారణాల రీత్యా 2015 జూన్లో సాయిబాబాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అదే ఏడాది డిసెంబర్లో మళ్లీ జైలుకు వెళ్లారు. దీంతో 2016 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2017 మార్చిలో సాయిబాబా కేసు దర్యాప్తును చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 13, 18, 20, 39 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతోపాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. దీంతో ఢిల్లీ వర్సిటీలోని రామ్లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి 2021 ఫిబ్రవరిలో సాయిబాబాను తొలగించారు.
2014 నుంచి 3,588 రోజులపాటు జైలులోనే ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదురొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలు చుట్టుముట్టాయి. వీటితోపాటు హృద్రోగ సమస్యలు కూడా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు విప్లవ రచయితర సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్యం దెబ్బతినడంతో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత 2022 అక్టోబర్లో బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లడంతో సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టు 2022 అక్టోబర్లో స్టే ఇచ్చింది. ఆ కేసులో మహారాష్ట్ర సర్కారు వాదనను తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు ఆయనను మరోసారి నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్రను సోమవారం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ జవహర్నగర్లోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీనివాస హైట్స్ వద్ద నుండి మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు సాయిబాబా పార్థివ దేహాన్ని గన్పార్కు చేర్చి అక్కడ పావుగంటపాటు ఉద్యమ సహచరుల సందర్శనార్థం ఉంచుతామన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానమిచ్చినట్టు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హక్కుల ఉద్యమకారుడు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మరణం దేశంలోని ప్రజా ఉద్యమాలకు తీరని లోటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి హక్కుల కోసం రాజీలేని పొరాటం చేశారని కొనియాడారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యావేత్త, మానవ హకుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రొఫెసర్ సాయిబాబా మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 90% అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సలైట్గా ముద్రవేసిందని, కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి ఉపా చట్టం కింద సుదీర్ఘ కాలంపాటు జైలులో నిర్భందించిందని మండిపడ్డారు. జైలులో ఉన్న సమయంలో ఆయనకు సరైన వైద్య సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ సాయిబాబా మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిజజీవితంలో సాయిబాబా వికలాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పొరాటం చేశారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయిబాబా మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క కూడా సంతాపం వ్యక్తం చేశారు.
మానవ హకుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా మరణం బాధాకరమని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. సాయిబాబాది ధిక్కార స్వరం కాదని, ఆయన అసమ్మతి వాది మాత్రమేనని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.