ప్రొఫెసర్ జగదీశ్కుమార్ ప్రతిభకు పట్టం
ప్రస్తుతం ఢిల్లీ జేఎన్యూ వీసీగా సేవలు
యూజీసీ చైర్మన్గా ఐదేండ్లు పదవీకాలం
నల్లగొండ జిల్లా మామిడాల జగదీశ్ స్వస్థలం
26 ఏండ్ల తర్వాత తెలుగువారికి అవకాశం
ఎన్ఈపీ అమలే నా మొదటి ప్రాధాన్యం.
ఈ పదవి నిజంగానే సవాలుతో కూడుకొన్నది. ప్రస్తుతం నా ప్రధాన లక్ష్యం నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) సమర్థంగా అమలుచేయటమే. త్వరలోనే పూర్తిగా అమలు కాబోతున్న ఎన్ఈపీ మన విద్యావ్యవస్థను అత్యుత్తమంగా మార్చనున్నది. ఎన్ఈపీ అమలుపై త్వరలోనే దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశమవుతాను. ప్రభుత్వం తాజా బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రతి వ్యక్తికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ సాంకేతికతపై పనిచేస్తాం. – ప్రొఫెసర్ జగదీశ్కుమార్
న్యూఢిల్లీ/నల్లగొండ, ఫిబ్రవరి 4 : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) వైస్ చాన్స్లర్, తెలంగాణ బిడ్డ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్గా నియమితులయ్యారు. 60 ఏండ్ల జగదీశ్కుమార్ ఐదేండ్లపాటు లేదా ఆయనకు 65 ఏండ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. జగదీశ్కుమార్ను యూజీసీ చైర్మన్గా నియమిస్తూ కేంద్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన 2016 జనవరి నుంచి జేఎన్యూ వీసీగా కొనసాగుతున్నారు. ఏడాది క్రితమే పదవీకాలం ముగిసినప్పటికీ కేంద్రప్రభుత్వం ఆయననే కొనసాగిస్తూ వస్తున్నది. తాజాగా దేశంలోని అన్ని యూనివర్సిటీలను మానిటర్ చేసే యూజీసీకి చైర్మన్గా నియమించింది. ఈ పదవిలో కొనసాగిన ప్రొఫెసర్ డీపీ సింగ్కు 65 ఏండ్లు నిండటంతో గత డిసెంబర్ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి అది ఖాళీగా ఉన్నది. 1991-95 మధ్య ప్రొఫెసర్ రాంరెడ్డి యూజీసీ చైర్మన్గా పనిచేశారు. ఆయన తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టిన తెలుగు వ్యక్తి జగదీశ్కుమారే.
కరెంటు కూడా లేని పల్లె నుంచి అత్యున్నత స్థాయికి
ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ అతి సామాన్య పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకొన్నారు. విద్యుత్తు సౌకర్యం కూడా లేని మారుమూల పల్లె నుంచి వచ్చిన ఆయన, దేశ విద్యా వ్యవస్థకే దిక్సూచి లాంటి యూజీసీ చైర్మన్గా ఎదిగారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. స్వగ్రామం పేరే ఆయన ఇంటిపేరు కూడా. ఆయన తల్లిదండ్రులు మామిడాల రంగారావు, జయప్రదాదేవి. రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1994లో రిటైర్ అయ్యారు. జగదీశ్కుమార్కు 1990లో లక్ష్మితో వివాహం జరిగింది. వారికి సాకేత్, కార్తీక్ అనే కుమారులు ఉన్నారు. సాకేత్ నానో ఎలక్ట్రానిక్స్లో పీహెచ్డీ చేస్తుండగా, చిన్న కుమారుడు కార్తీక్ నానో ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్ చేస్తున్నారు. మామిడాలలో వారికి ఇల్లు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. జగదీశ్కుమార్కు షిటోరాయ్ కరాటేలో మంచి ప్రావీణ్యం ఉన్నది. ఆయన అక్క సునీత, చెల్లెలు గీత హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. జగదీశ్కుమార్ యూజీసీ చైర్మన్గా ఎంపిక కావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగదీశ్కుమార్ నిర్వహించిన కీలక బాధ్యతలు..
సర్కారు బడి నుంచి ఐఐటీకి
జగదీశ్కుమార్ ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. ఉన్నత, ఇంటర్ విద్యను మిర్యాలగూడలో పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివిన ఆయన ఐఐటీ మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఎంఎస్, పీహెచ్డీ చేశారు. కెనడాలో మూడేండ్లపాటు పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ కొనసాగించారు. కెనడాలో పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ తర్వాత ఖరగ్పూర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి మారారు. 1997లో అసోసియేట్ ప్రొఫెసర్గా, 2005లో ప్రొఫెసర్గా ఉద్యోగోన్నతి పొందారు. నెదర్లాండ్స్కు చెందిన ఫిలిప్స్ సెమీ కండక్టర్స్ సంస్థ ఐఐటీ ఢిల్లీలో ప్రారంభించిన ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మొదట్లో చైర్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు ఢిల్లీ ఐఐటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోని ఎలక్ట్రానిక్స్ గ్రూప్కు చైర్మన్గా సేవలందించారు. ఐఐటీ ఢిల్లీ నుంచి అభివృద్ధి చెందిన నానో-స్కేల్ రిసెర్చ్ ఫెసిలిటీ (ఎన్ఆర్ఎఫ్) ముఖ్య పరిశోధకుల్లో జగదీశ్కుమార్ ప్రముఖులు. ఆయనకు 2013లో లార్జ్ క్లాస్ విభాగంలో ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. తాను నిర్వహించిన 200 పరిశోధనలను ఒకచోట చేర్చి 4 పుస్తకాలను ముద్రించారు.