చిన్న పరిశ్రమలను కనుమరుగుచేసే కుట్ర
టెక్స్టైల్, ఫౌండ్రీ రంగాల్లో ఇప్పటికే అమలు
ఇప్పుడు పాడి పరిశ్రమపై మోదీ సర్కార్ కన్ను
దేశంలో 9 కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం
పాలు, పాల ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ధ్వజం
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కనుమరుగు చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నదని ధ్వజమెత్తారు. గత నెల 28, 29న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన ఈ నిర్ణయంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తన అభిప్రాయాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలో లేని ప్రీప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ పాల ఉత్పత్తులపై 5% పన్ను విధించాలన్న నరేంద్రమోదీ సర్కారు నిర్ణయంతో పెరుగు, లస్సీ, బటర్మిల్క్ లాంటి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని తెలిపారు. డెయిరీ మిల్కింగ్ మెషినరీ (పాలు, పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే యంత్రసామగ్రి)పై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీనీ 18 శాతానికి పెంచాలన్న నిర్ణయం దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తుల తయారీపై ఆధారపడిన కోట్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.
మిగిలేది బడా ప్లేయర్లే
ఇప్పటికే పశువుల మేత (ఫీడ్) మొదలుకొని పాడి పరిశ్రమకు అవసరమైన పలు ఇతర వస్తువుల ధరలు పెరగడంతో పాలు, పాల ఉత్పత్తుల తయారీ ఖర్చు పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ భారం మరింత అధికమవుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ వివరించారు. దేశంలో వ్యవసాయరంగం తర్వాత పేదరిక నిర్మూలనకు అధికంగా దోహదపడుతున్నది పాడి పరిశ్రమేనన్నారు. దేశ వ్యవసాయరంగ జీడీపీలో పాడి పరిశ్రమ వాటా 25% మేరకు ఉన్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల గ్రామీణ కుటుంబాలు, ప్రత్యేకించి సన్న, చిన్నకారు రైతులు, మహిళలు ప్రత్యక్షంగా పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. కేంద్ర నిర్ణయం వల్ల వీరందరిపై పెట్టుబడి భారం పెరిగి సహకార రంగంలో ఉన్న పాడి పరిశ్రమ కుదేలవుతుందని, చివరకు బడా కార్పొరేట్ సంస్థలు మాత్రమే ఈ రంగంలో నిలబడతాయని తెలిపారు. త్వరలో పాలు, పెరుగు, లస్సీ, బటర్మిల్క్ ధరలను పెంచనున్నట్టు ఇప్పటికే అమూల్ లాంటి సంస్థలు ప్రకటించాయని, ఈ భారాన్ని అంతిమంగా వినియోగదారులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ పెంపుతో ఇప్పటికే జౌళి, ఫౌండ్రీ రంగాల్లో చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులు అదృశ్యమై, బడా ప్లేయర్లు మాత్రమే మిగిలారని ప్రొఫెసర్ నాగేశ్వర్ గుర్తుచేశారు.