మహబూబ్ నగర్ : జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు మహా బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు విదేశాల్లోనూ విక్రయించేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఎక్స్ఫో ప్లాజాలో నాబార్డ్ ద్వారా ఏర్పాటు చేసిన ‘ నాబార్డు మహా గ్రామీణ మేళాను’ మంత్రి ప్రారంభించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఉమ్మడి పాలనలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాటినే ప్రదర్శనలో ఉంచేవారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మహబూబ్ నగర్(Mahaboobnagar) జిల్లాతో మహా బ్రాండ్(Maha Brand) పేరుతో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అమెజాన్(Amazon), ఫ్లిప్ కార్ట్(Flipcard) ద్వారా ఆన్లైన్లో అమ్మకాలను కొనసాగించడం జరిగిందని తెలిపారు.
నాణ్యమైన ఉత్పత్తులను హైదరాబాద్లోనే కాకుండా ఇతర దేశాలలో సైతం అమ్మే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు గాను ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే రూ. 308 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. నాబార్డు ద్వారా మహిళా సంఘాల ఉత్పత్తులకు చేయూతనిచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు.
దివిటీపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ కారిడార్ లో దళిత బంధు సహకారంతో మినీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మహిళలు ముందుకు వస్తే సహకరిస్తామని మంత్రి వెల్లడించారు. దిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఐటీ కారిడార్ లో వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయని వివరించారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, నాబార్డ్ డీడీఎం ఎంవి విఎస్ శ్రీనివాస్, ఎల్డీఎం కాల్వ భాస్కర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు