హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నెల 22న భూపాలపల్లి ఆర్టీవో ఆఫీస్ వద్ద బొగ్గు లారీ ఢీకొనడంతో డీటీవో మృతిచెందారు. ప్రమాదంపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ బుధవారం విచారణ చేపట్టారు. ముందుగా భూపాలపల్లిలో ఘనపూర్ పోలీస్స్టేషన్లోని అధికారులతో సమావేశమయ్యారు. పోలీసులు చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు వివరాలను స్టేషన్ సీఐ కరుణాకర్రావు, ఎస్ఐ అశోక్ను అడిగి తెలుసుకొన్నారు. లారీ డ్రైవర్, ఓనర్, హార్వెస్టర్ డ్రైవర్ను విచారించారు.
తర్వాత జెన్కో అధికారులతో సమావేశమై.. ఆ రోజు లారీలో ఉన్న బొగ్గు వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు ప్రత్యక్షసాక్షులను విచారించారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. తాడిచర్లకు వెళ్లి అకడ ఓపెన్కాస్ట్ ప్రతినిధులతో సమావేశమై ఆరోజు లారీ లోడ్ రికార్డులను పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వివరాలను రవాణా కమిషనర్కు అందించనున్నట్టు తెలిసింది. ఆయన వెంట మోటరు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్, శివపల్లి శ్రీనివాస్, బారగాడి శ్రీనివాస్, భూపాలపల్లి ఏఎంవీఐలు ఫాహిమా సుల్తానా, సుందర్లాల్, శ్రీనివాస్ ఉన్నారు.