PRLI | పాలమూరు ప్రజల దశాబ్దాల కాల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే కృష్ణా జలాలకు పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాటు పూర్తి చేశారు.
పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం కొల్లాపూర్లోని సింగోటం కూడలి వద్ద జరుగనున్న సభాస్థలి దగ్గర అందరూ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత భారీ ప్రాజెక్టు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారని, మధ్యాహ్నం నార్లపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి అనంతరం ఇంటెక్ వద్ద కృష్ణా జలాలకు పూజలు నిర్వహిస్తారన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్లోని అన్ని గ్రామ పంచాయతీలకు కలశాల ద్వారా కృష్ణ జలాన్ని ఎంపీడీఓల ద్వారా పంచాయతీ సెక్రెటరీలు, సర్పంచులకు అందించడం జరుగుతుందన్నారు. కలశాల్లో ఇచ్చిన జలాలతో గ్రామాల్లోని దేవతల కాళ్లు కడిగి అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం సింగోటం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. సభా స్థలం వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి భారీ స్క్రీన్లపై ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బస్సు ద్వారా వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తాగునీరు, కూర్చోడానికి కుర్చీలు, మొబైల్ మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.
బస్సులకు, వీఐపీలకు వేర్వేరుగా రూట్ల వారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దానితో పాటు ఏ రూట్ బస్సు ఎక్కడ పార్కింగ్ చేయాలి అందుకు సంబంధించిన సైన్ బోర్డులు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బందోబస్తు అదేవిధంగా మొబైల్ ఎల్ఈడీ తెరలు సైతం ఏర్పాటు చేసి పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల కోసం శ్రమించిన సిబ్బంది, కార్మికులను కలెక్టర్ అభినందించారు.