తొర్రూరు, మే 9: కాంగ్రెస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలికన్నీరు కారుస్తున్నదని దుయ్యబట్టారు. పైగా అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తాం, డబ్బులిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న తీరు నవ్వు తెప్పిస్తున్నదని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు వార్డుల బీఆర్ఎస్ శ్రేణుల తో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరుల కుటుంబాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే హత్య చేసి శవంపై దండలు వేసి కన్నీరు కారుస్తున్న చందంగా ఉన్నదని అన్నారు. 25 ఏండ్ల కిందనే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆత్మబలిదానాలు జరిగేవా? అమరవీరుల కుటుంబాలు ఉండేవా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన మోసంతోనే అనేక మంది బలిదానాలు చేసుకున్నారని తెలిపారు.
దేశం కోసం గాంధీ తరహాలో, తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేపట్టి పోరాటం చేస్తే రాష్ట్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటివరకు 1.33 లక్షల పైచిలుకు ప్రభు త్వ ఉద్యోగాలు ఇచ్చామని ఇంకా 80 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎకడైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పెట్టుబడికి నిధులు ఇస్తున్నారా? అడిగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని విధానాలు తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల కోసం, ఓట్ల కోసం గారడీ మాటలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే రూ.200కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి రూ.1,200 చేశారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచి అన్ని వస్తువుల ధరల పెరుగుదలకు కారకులై నేడు ధరలు తగ్గించాలని ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.