బంజారాహిల్స్,జూన్ 15: అది హైదరాబాద్ మహానగరం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఖరీదైన ప్రభుత్వ స్థలం.. కూతవేటు దూరంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం.. ఆ స్థలాన్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. షేక్పేట మండలం సర్వేనంబర్-403లోకి వచ్చే టీఎస్ నంబర్ 5, బ్లాక్ హెచ్, వార్డు 10లో సుమారు 2,000 గజాల ప్రభుత్వ స్థలం అక్కడ ఖాళీగా ఉన్నది. తెలంగాణ భవన్ ముందు నుంచి రోడ్ నం.12కు కొత్తగా వేసిన లింక్ రోడ్డుకు ఒకవైపు పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం ఉండగా, రెండోవైపున ఉన్న ఈ ఖాళీ స్థలంలో గతంలోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు. ఈ స్థలం తమదంటూ గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకు ప్రయత్నించగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ స్థలంతో కలిపి మొత్తం 2,000 గజాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్నదని, ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.60 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో వచ్చిన వ్యక్తులు సుమారు 1,000 గజాల స్థలంలోకి ప్రవేశించారు. ఆ స్థలంలోని ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించారు. దానిచుట్టూ గుంతలు తవ్వి కాంక్రీట్ పూడ్చి, చుట్టూ బ్లూషీట్స్ వేశారు. వారిని కొందరు స్థానికులు ప్రశ్నించగా, ఈ స్థలం పవన్కుమార్ అనే వ్యక్తిదని ఈ స్థలంలోకి రెవెన్యూ అధికారులు ప్రవేశించకుండా హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నాయంటూ దబాయించారు. సర్వే నంబర్ 129/104(ఓల్డ్)(403/53న్యూ)లోకి వచ్చే ఈ స్థలాన్ని తమ తండ్రి 1967లో కొనుగోలు చేశాడని, దీన్ని తన పేరుతో 1987లో గిఫ్ట్ డీడ్ చేయగా, అప్పటినుంచి తమ ఆధీనంలోనే ఉన్నదంటూ పవన్కుమార్ తెలిపారు. తమను రెవెన్యూ సిబ్బంది ఇబ్బందిపెడ్తూ ఫెన్సింగ్ వేసుకోనివ్వకపోవడంతో హైకోర్టులో కేసు వేసి ఆదేశాలు తెచ్చుకున్నామని పేర్కొన్నారు.
ఉనికిలో లేని సర్వేనంబర్తో ఆదేశాలు: తహసీల్దార్
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాండ్ కంట్రోల్ పక్కనున్న 2,000 గజాలు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ స్థలంగా ఉన్నదని, ఇదంతా సర్వేనంబర్ 403లోకి వస్తుందని షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు. ఈ స్థలం సర్వే నంబర్ 129/104(ఓల్డ్)లోనిది అంటూ కొందరు ఈ స్థలంపై కోర్టు ఆదేశాలు తెచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, కోర్టు తీర్పులో పేర్కొన్న సర్వే నంబర్ ఉనికిలో లేదని ఆమె తెలిపారు. బ్లూషీట్లు వేసుకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, కోర్టు ఆదేశాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు.