హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనే ఎంచుకొంటున్నారు. వసతులు, ల్యాబ్లు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉండటంతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఈ ఏడాది పాలిసెట్లో ప్రభుత్వ కాలేజీల్లో 84% సీట్లు నిండితే.. అదే ప్రైవేట్ కళాశాలల్లో 59% సీట్లే భర్తీ అయ్యాయి. శుక్రవారం పాలిసెట్ తుది విడత సీట్లను కేటాయించారు. మొత్తం 118 కాలేజీలుంటే 69.76% సీట్లు నిండాయి. రెండు ప్రభుత్వ కాలేజీల్లో, ఒక ప్రైవేట్ కాలేజీలో 100% సీట్లు భర్తీ అయ్యాయి.
ప్రస్తుతం 9,595 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొంది న విద్యార్థులు 16 లోపు ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. 14 నుంచి 20 వ రకు ఓరియంటేషన్ను నిర్వహించనుండగా, 21న మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. కోర్సులవారీగా తీసుకొంటే సీఎస్ఈ కోర్సులో 87.62 శాతం సీట్లు భర్తీకాగా, ఆ తర్వాత ఈసీఈలో సీట్లు నిండాయి.