నిజామాబాద్, అక్టోబర్ 2 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రెండు వేర్వేరు సభలను నిర్వహిస్తున్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.8,021 కోట్లతో చేపట్టబోయే అధికారిక కార్యక్రమాల కోసం నిర్వహించే సభ. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మరొకటి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే రాజకీయ సభ. ఇందుకోసం ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎంఐ-17 హెలిక్యాప్టర్లో బీదర్ నుంచి బయలుదేరి నిజామాబాద్కు మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్గా రామగుండంలోని ఎన్టీపీసీ 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. దీంతోపాటు పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ సభకు హాజరై ప్రసంగిస్తారు. ఒకే మైదానంలో రెండేసి సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ కార్యక్రమాల కవరేజీకి ఎస్పీజీ, ఎన్ఎస్జీ బలగాలు మీడియాకు ఆంక్షలు విధించాయి.