నందిగామ, నవంబర్ 26: ధ్యానం, యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని శ్రీరామచంద్రమిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు బాబూజీ మహరాజ్ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ పటేల్తో కలిసి మొక్కలు నాటారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లక్ష మంది అభ్యాసీలు ఒకే దగ్గర కూర్చోని ధ్యానం చేసేలా ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, కన్హాశాంతి వనంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలోకి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
యోగా, ధ్యానం ప్రాచీన జ్ఞానులు అనుసరించిన సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేసేందుకు శ్రీరామచంద్ర మిషన్, కన్హా శాంతివనం చేస్తున్న కృషిని గుర్తించి భారత ప్రభుత్వం దాజీకి పద్మభూషణ్ అవార్డు అందించిందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా క్రమం తప్పకుండా చేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని, కరోనా విపత్కర పరిస్థితులలో టీకాలు అందించి ఇతర దేశాలకు చేయూతనందించడంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూశాయని తెలిపారు. భారతదేశం మరింత బలోపేతం కావడానికి నారీ శక్తి, యువ శక్తి, శ్రమ శక్తి, ఉద్యమ శక్తి ఎంతో అవసరమని ఉద్ఘాటించారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడకుండా చూడాలని, మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 40 వేల మందికి పైగా అభ్యాసీలు పాల్గొన్నారు.