నాగర్కర్నూల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఆగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే చూశానని, ఇప్పుడూ చూస్తున్నానని చెప్పారు. ఝూటా మాటలతో హస్తం పార్టీ మోసం చేసిందని దుయ్యబట్టారు. శనివారం నాగర్కర్నూల్లోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కాంగ్రెస్ ఓటుబ్యాంకుగానే చూసిందని ధ్వజమెత్తారు. బీజేపీని ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు సాగనివ్వనని అన్నారు. అభివృద్ధికి మోదీ గ్యారెంటీ అని, పూర్తి మెజార్టీ ఇస్తే సేవ చేసి చూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు అవమానానికి గురయ్యాయన్నారు. యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి అవమానించారని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో 2జీ కుంభకోణం, బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మద్దతు బీజేపీకే కావాలని కోరారు. సోషల్ మీడియాలో నమో ఇన్ తెలుగు ద్వారా ఏఐ టెక్నాలజీతో తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. బీజేపీకి 400 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.